Telugu Gateway
Politics

రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన మోడీ..రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు

రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన మోడీ..రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు
X

చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిల పడతారు.

రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కాశ్మీర్, పుల్వామాలంటారు

ప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ సీఎం కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో కూడా రైల్వేలు సేవలు అందించాయన్నారు. అలాంటి రైల్వేలను ప్రైవేటు పరం చేసే అవసరం ఏమొచ్చింది? రైల్వే స్టేషన్ లో ఛాయి అమ్మిన అని చెప్పిన మోడీ ఇప్పుడు రైల్వే స్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి'' అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం గడిచిన ఆరున్నరేళ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉండి, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. ''నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటి దాకా ప్రజల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు. చెప్పుకోవడానికి వారికి ఒక్క విషయమూ లేదు. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కాశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారు.

ప్రజలను మత పరంగా విభజించే ప్రయత్నం చేస్తారు. మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు. అంతే తప్ప దేశం కోసం, ప్రజల కోసం వారు ఏ ఒక్క పని చేయలేదు. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిల పడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు. బేటీ బచావో, బేటీ పడావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొడతారు తప్ప వాస్తవానికి ఏ పని చేయరు. గులకరాల్ల డబ్బాను ఊపినట్లు వాళ్ల ప్రచారం ఉంటుంది'' అని కేసీఆర్ విమర్శించారు. ''దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో దూర దృష్టితో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు. వీటి వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. కానీ బిజెపి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, పెట్టుబడులను ఉప సంహరించుకుని, వాటిని ప్రైవేటు-కార్పోరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ అనే ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. అరుణ్ శౌరిని దానికి మంత్రిని చేశారు. మొదటి సారిగా వాజ్ పేయి ప్రభుత్వం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉప సంహరించుకున్నది. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని బిజెపి విధానాలను కొనసాగించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. తద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేటు కంపెనీలకు అప్పగిస్తున్నది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ, 65 వేల కిలోమీటర్ల నెట్ వర్క్ భారతీయ రైల్వేలకు ఉంది.

లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. ప్రతి రోజు కోట్లాది మందికి సేవలు అందిస్తున్నది. ''దేశానికే గర్వ కారణమైన సంస్థల్లో భారత జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. బంగారు బాతు లాంటిది. 40 కోట్ల మంది పాలసీ దారులు, 30 లక్షల కోట్ల ఆస్తి కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు నిధులు కూడా సమకూరుస్తోంది. 2020-21 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎల్.ఐ.సి. డివిడెంట్ 2,600 కోట్ల రూపాయలుగా చూపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా పథకాన్ని ఎల్.ఐ.సి. గొప్పగా అమలు చేస్తున్నది. కేవలం పది రోజుల్లోనే పరిహారం అందిస్తున్నది. ఇంతటి ప్రాముఖ్యత, ఆవశ్యకత ఉన్న ఎల్.ఐ.సి.ని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎల్.ఐ.సి. లాభాలు గడిస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. కానీ విదేశీ కంపెనీలు లాభాలు గడిస్తే దేశానికి ఏం లాభం ? ఆ కంపెనీలు తమ లాభాలను ఎక్కడికి తరలిస్తాయో కూడా తెలియదు'' అని సిఎం కేసీఆర్ విమర్శించారు.

Next Story
Share it