Telugu Gateway
Politics

చంద్రబాబు నోట క్షమాపణ

చంద్రబాబు నోట క్షమాపణ
X

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోట తొలిసారి 'క్షమాపణ' అన్న మాట వచ్చింది. గతంలో ఎప్పుడూ ఆయన ఆ మాట చెప్పిన దాఖలాలు లేవు. కాకపోతే ఆ క్షమాపణ కూడా ఏ మాత్రం 'సింక్' కాకుండా చెప్పారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలనే తాను కృషి చేశానని..అదే తాను చేసిన తప్పు అయితే తనను క్షమించాలని కోరారు. కనీసం చంద్రబాబు అయినా తాను ప్రజలందరి కోసం చేసినట్లు భావిస్తే మరి ఈ క్షమాపణ' చెప్పాల్సిన అవసరం ఏముంది?. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నాటకాలు నమ్మి జనం పూనకం వచ్చినట్లు ఓట్లేశారని.... తానేం తప్పు చేశానో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.

రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరన్నారు. రైతు కూలీలు చితికిపోయారని తెలిపారు. ఏడు వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని... అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్ళు, బూతులు మంత్రులు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలని వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్‌లో తెలుస్తుందన్నారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసాగిస్తున్నారన్నారు. అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు. పట్టణాల్లో అన్నింటి పైనా పన్నులే అని... పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారని దుయ్యబట్టారు. గాలి రెడ్డి కాబట్టి రేపో మాపో గాలిపైనా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారన్నారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేలు భారం మోపారన్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80లక్షల భారం పడిందని.. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు విమర్శించారు.

Next Story
Share it