మన శంకరవర ప్రసాద్ టికెట్ రేట్లు పెంపు

తెలంగాణ లో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపు ఉంటుందో ఉండదో తెలియక గురువారం అంటే జనవరి 8 అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. ప్రీమియర్స్ విషయంలో కూడా అదే పరిస్థితి. కానీ ఎప్పుడో అర్ధరాత్రి టికెట్ రేట్ల పెంపు మెమో జారీ అయింది. అప్పుడు కానీ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమా జనవరి 12 న విడుదల అవుతుంటే జనవరి 10 ఉదయానికి మెమో బయటకు వచ్చింది. మరి ప్రభాస్ విషయంలో అలా...చిరంజీవి విషయంలో ఇలా ఎందుకు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు సినిమాల విషయంలో తెలంగాణ సర్కారు ప్రతిసారి తన ఆదేశాలను తానే తూట్లు పొడుచుకుంటూ వెళుతోంది. అంతే కాదు ఇక నుంచి మెమోల ద్వారా టికెట్ రేట్ల పెంపు వద్దు అని తెలంగాణ హై కోర్టు ఆదేశించినా కూడా ఆ ఆదేశాలను కూడా పక్కనపెట్టి మరీ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ మరో మెమో జారీ చేసింది ప్రభుత్వం.
అందులోనే జనవరి 11 న ప్రీమియర్స్ కూడా అనుమతి ఇచ్చారు. దీనికి ఒక్కో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షో టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆరు వందల రూపాయలుగా నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుంచి వారంపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకారం తెలిపారు. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లో జీఎస్ టి తో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే రాజాసాబ్ సినిమా విషయంలో అర్ధరాత్రి వరకు మెమో ఇవ్వకుండా ఆపిన ప్రభుత్వం ..చిరంజీవి సినిమా దగ్గర కు వచ్చే సరికి శనివారం ఉదయానికి మెమో ను బయటపెట్టింది.
జనవరి 10 రెండవ శనివారం కావటం...తర్వాత ఆదివారం కావటంతో ఆగమేఘాల మీద దీనిపై ఎవరూ కోర్టు ను ఆశ్రయించటానికి వీలు ఉండదు. అందుకే ఇలా మెమో ను ముందే విడుదల చేసి..ఈ లోగా ఎన్ని టికెట్స్ అమ్మితే అంత మేర పని పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. అసలు చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ భారీ బడ్జెట్ సినిమా కాదు...దీనికి రేట్లు పెంచాల్సిన అవసరం కూడా లేదు అని టాలీవుడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయినా సరే రెండు ప్రభుత్వాలు కూడా ఈ మూవీకి రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చిరంజీవి ఈ మూవీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.



