Telugu Gateway
Cinema

ఆ ముగ్గురి వైపే అందరి చూపు

ఆ ముగ్గురి వైపే అందరి చూపు
X

రాజకీయాల్లో అయినా...సినిమాల్లో అయినా ఒక్కో సారి ఒక్కొక్కరి హవా నడుస్తుంది. ఎప్పుడూ కాలం కొంతమందికే అనుకూలంగా ఏమీ ఉండదు. అయితే కాలం కల్పించే అవకాశాలను కూడా సరిగా ఉపయోగించుకునే వాళ్ళే మంచి విజయాలు సాధిస్తారు. కొత్త కొత్త చరిత్రలు సృష్టిస్తారు. ఈ జాబితాలో ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ముగ్గురు కీలక దర్శకులు ఉన్నారు . వాళ్ళే ఎస్ ఎస్ రాజమౌళి, వంగా సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ వాస్తవానికి కర్ణాటకలో సెటిల్ అయినా కూడా అయన కుటుంబ సభ్యులది అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురం, ఇక రాజమౌళి, వంగా సందీప్ రెడ్డి లు పక్కా తెలుగురాష్ట్రాలకు చెందిన వారే. ఇప్పుడు ఈ ముగ్గురే భారతీయ సినిమా ని శాసిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమాలను తెరకెక్కించారో అప్పటినుంచి ఇండియన్ సినిమా సంకెళ్లు తెగిపోయాయి. ఏ ప్రాంతీయ బాషా చిత్రాలు ఆయా రాష్ట్రాల్లోనే విడుదల అవుతున్నా కూడా ఈ ముగ్గురు దర్శకులు తెరకెక్కించే సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అవుతున్నాయి. వీళ్ళ ముగ్గురిలో వంగా సందీప్ రెడ్డి చేసింది రెండు సినిమాలే కానీ...వాటితోనే దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపారు . అయితే అయన తెరకెక్కించిన రెండు సినిమాలు అర్జున్ రెడ్డి, యానిమల్ లు రేండూ పెద్ద ఎత్తున వివాదాస్పదం అయ్యాయి కూడా . అయితే ఏ సినిమా అయినా హిట్టా..ఫట్టా అనేది నిర్ణయించేది కలెక్షన్స్ ఆధారంగానే కాబట్టి ఈ రెండు సినిమాలు వాణిజ్యపరంగా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి.

ఇక రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత అయన కొత్త సినిమా ప్రకటిస్తున్నారు అంటేనే అందరి దృష్టి వాటిపైనే . ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో కలిసి ఒక కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అంటే చాలు అది విడుదల అయ్యే వరకు దీనిపై హైప్ అలా పెంచుకుంటూ పోతారు. ఇప్పటివరకు అయన కెరీర్ లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా వాణిజ్య పరంగా ఫెయిల్ అయిన సినిమా లేదు అంటే రాజమౌళి సత్తా అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే అయన పేరు దేశంలో మారుమోగింది కెజీఎఫ్ సినిమాలతోనే అని చెప్పాలి. కెజీఎఫ్ 2 ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1250 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం నమోదు చేసింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా తో కూడా అయన తన మార్క్ చూపించారు. కలెక్షన్ల పరంగా సలార్ దుమ్మురేపుతోంది.దక్షిణాది సినిమాలు...ఈ ప్రాంతానికి చెందిన డైరెక్టర్ల ప్రభావం బాలీవుడ్ పై ఎంతగా పడింది అంటే...బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఏకంగా తమిళ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి జవాన్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ టాలీవుడ్ కు చెందిన టాప్ హీరో ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నారు...దీంతో పాటు సలార్ పార్ట్ 2 కూడా ఉన్న విషయం తెలిసిందే. వంగా సందీప్ రెడ్డి ప్రభాస్ తో కలిసి స్పిరిట్, అల్లు అర్జున్ తో మరో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు దర్శకులు భారతీయ సినిమా చరిత్రలో కొత్త కొత్త రికార్డులు నెలకొల్పటం ఖాయం అని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Next Story
Share it