Telugu Gateway
Andhra Pradesh

మోడీ తో పవన్ భేటీ..టీడీపీ లో టెన్షన్!

మోడీ తో పవన్ భేటీ..టీడీపీ లో టెన్షన్!
X

నిజం మాట్లాడుకోవాలంటే కేంద్రంలోని బీజేపీ నాయకులు చాలా కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పెద్దగా పట్టించుకోవటంలేదు. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లు. ఒక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ మాత్రం ఏదో ఆలా ఆలా మాట్లాడుతూ పోతోంది. అంతే కాదు కేంద్రంలోని మోడీ సర్కారు. బీజేపీ పెద్దలు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కి అన్ని రకాలుగా పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నారు. అప్పుల దగ్గర నుంచి జగన్ కి కావాల్సిన పనులు అన్ని చేసిపెడుతున్నారు అనే ప్రచారం ఉంది. అదే సమయంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు పోలవరం సాయం విషయంలో మాత్రం పెద్ద ముందడుగు లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే. పోలీసులు అయన కార్యక్రమాన్ని అడ్డుకోవటంతో అక్కడ నుంచి పవన్ విజయవాడ వెళ్ళటం..అక్కడ ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలపటం అందరికి తెలిసిందే. అప్పటినుంచే మళ్ళి ఆంధ్ర ప్రదేశ్ లో టీపీడీ,, జనసేన కలసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరుగా సాగింది. ఇది దాదాపు ఫిక్స్ అన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. అయితే ఈ పొత్తు కుదరకుండా ఉండేందుకు అధికార వైసీపీ జనసేనను ఎంత రెచ్చ గొట్టాలో అంత రెచ్చ గొడుతోంది.

ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఈ తరుణంలో వైజాగ్ వస్తున్న ప్రధాని మోడీ అకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చర్చలకు పిలవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కు మోడీ ఏమి దిశా నిర్దేశం చేస్తారు. సీఎం జగన్ కు మేలు చేసేలా వచ్చే ఎన్నికల్లో కేవలం బీజేపీ, జనసేన మాత్రమే కలిసి ముందుకు సాగుదాం అని సూచిస్తారా ..లేక ఇంకేమి చెపుతారు అన్నది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ఉంది. ఇదే ఇప్పుడు టీపీడీ టెన్షన్ కు కారణం అవుతోంది. ఒక వేళా మోడీ బీజేపీ, జనసేనలు మాత్రమే కలసి ముందుకు సాగాలి అని సూచిస్తే దాన్ని పవన్ కాదని అనగలరా..అయితే ఈ విషయం మోడీ ఎంత బలంగా చెపుతారు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. ఎన్నికలకు ఇంకా దగ్గర దగ్గర ఏడాది పైనే సమయం ఉంది. అన్ని పార్టీలు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు మోడీ దగ్గర నుంచి ఊహించని తరహాలో పిలుపు రావటం ఈ చర్చకు కారణం అవుతోంది. మోడీ, పవన్ భేటీ తర్వాత జనసేన కదలికలు ఎలా ఉంటాయో చూస్తే కానీ వీరిద్దరి మధ్య ఏమి జరిగింది అన్నది బయటకు రాదు. అప్పటి వరకు టీడీపీ కి టెన్షన్ తప్పదేమో.

Next Story
Share it