ఒక్క ఏపీ లంచాలే 1680 కోట్లు అట !
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర ఇప్పుడు అమెరికా కోర్టు రికార్డు ల వరకు వెళ్ళింది. తాజాగా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పై అమెరికా లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అందులోనే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు గత వైసీపీ హయాంలో సాగిన ఒప్పందాలకు సంబదించిన విషయాలను కూడా ప్రస్తావించారు. విద్యుత్ సరఫరా ఒప్పందాల కోసం గౌతమ్ అదానీ 2021 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని వ్యక్తిగతంగా కలిసినట్లు అమెరికా కోర్టు నేరారోపణల్లో ప్రస్తావించింది. అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్ట్ చేసిన అభియోగాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు 200 మిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర 1680 కోట్ల వరకు లంచాలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. కోర్ట్ అభియోగాల ప్రకారం చూస్తే గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా అప్పటి సీఎం జగన్ ను కలిసి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవటనికి కావాల్సిన ఇన్సెంటివ్స్ తో పాటు పలు విషయాలపై చర్చించినట్లు ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం అధికారులకు లంచాలు ఇవ్వటానికి కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ఆ రికార్డు ల్లో పేర్కొన్నారు. ఒడిశా విద్యుత్ సరఫరా ఒప్పందం కంటే..ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబదించిన లంచం చాలా ఎక్కువ మొత్తం అని తెలిపారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు ల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెల్లించాల్సిన లంచం మొత్తం 200 మిలియన్ డాలర్స్ గా అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్స్ సంకేతాలు ఇచ్చారు అని తెలిపారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ప్రధాని మోడీ కి ఎంతో సన్నిహితుడిగా పేరున్న గౌతమ్ అదానీ దగ్గర అప్పటి జగన్ సర్కారు కానీ...అధికారులు కానీ ఇంత భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నది నిజమే అయితే ఇది పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పై నుంచి కింద వరకు అంతా తెలిసే జరుగుతుంది అన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై ఏమైనా విచారణ చేయించుతుందా...లేక ఎవరిపై ఆయినా చర్యలు తీసుకుంటుందా అంటే ఏ మాత్రం ఛాన్స్ లేదు అనే చెప్పొచ్చు. అటు జగన్ అయినా..ఇటు చంద్రబాబు అయినా కేంద్రంలో మోడీ అక్కడ ఉన్నంత వరకు అదానీ పై ఈగ వాలనియ్యరు అనే విషయం ప్రతిఒక్కరికి తెలిసిందే.