ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
ఏపీ సర్కారు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 4 వరకూ కొనసాగనుంది. రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఇది అమల్లో ఉండనుంది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జీవో 456 జారీ చేశారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు అమలులో ఉండే ఈ కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్లు 51 నుండి 60 మరియు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని సెక్షన్ 188,ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు,పోలీస్ కమీషనర్లను ఆదేశించారు.