ఖమ్మం 'టీఆర్ఎస్'లో కలకలం

Update: 2021-01-17 13:30 GMT

ఖమ్మంలో అధికార టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో నేతల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది. పొంగులేటి చేసిన సంచలన వ్యాఖ్యలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీల మధ్య వైరాన్ని స్పష్టం చేసింది. పొంగులేటి ఆదివారం నాడు వేంసూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాభిమానమే నాకు చాలా పెద్ద పదవి అని, పదవి రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదని అన్నారు. పదవి పోయేటప్పుడు కాంక్రీట్‌ గోడలు కట్టినా లాభం ఉండదని వ్యాఖ్యానించారు. పదవులు ఎవరి సొత్తూ కాదని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తారని అన్నారు. 'అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. టీఆర్‌ఎస్‌లో ఉన్నాం.. రేపు కూడా ఇదే పార్టీలో ఉంటాం. కానీ ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు మంచిదికాదు.

నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలియని అసమర్థుడిని కాను. నా వారిని ఇబ్బంది పెట్టినవారు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. చక్రవడ్డీతో సహా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. అధికారం ఉందికదా అని ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదు. నేను ప్రజాప్రతినిధిని కాను, ఎవరి పర్మిషనూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్లాల్సిందే. నా వర్గం ప్రజాప్రతినిధులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు'అని పొంగులేటి పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ లో ఉంటూ మాజీ ఎంపీ అధికారం ఉంది కదా అని వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News