Telugu Gateway
Politics

కేంద్రంతో ఇక బిగ్ ఫైట్స్..టీఆర్ఎస్

కేంద్రంతో ఇక బిగ్ ఫైట్స్..టీఆర్ఎస్
X

కేంద్రంతో ఇక పార్లమెంట్ లో పోరాటం చేయబోతున్నామని..దాన్ని యుద్ధం అనుకున్నా తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు వ్యాఖ్యానించారు. గురువారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కె. కేశవరావు, లోక్ సభలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణ ను పెడచెవిన పెట్టిందని కేశవరావు ఆరోపించారు. ‘రాజ్యాంగబద్దంగా తెలంగాణ కు రావాల్సిన నిధులు ,హామీలు నెరవేర్చడం లేదు. కృష్ణా నదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చడం లేదు. తెలంగాణ లో సాగు విస్తీర్ణం 24 శాతానికి పైగా పెరిగినా దానికి తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు. కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టంను వ్యతిరేకిస్తున్నాం. .ఆ చట్టం తో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది. .ఇక్కడి బీజేపీ నేతలు ఆ చట్టాన్ని సమర్థిస్తారా ?. జాతీయ రహదారుల విస్తరణ పై కేంద్రం మాట తప్పింది. కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇంత మోసపూరిత సర్కార్ ను చూడలేదు. నవోదయ స్కూళ్ళు తెలంగాణకు 22 రావాలి ..అయినా కేంద్రం స్పందించడం లేదు. జీఎస్ టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోంది ..రావాల్సిన పది వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇంకా ఇవ్వట్లేదు. వరంగల్ లో టెక్సటైల్ పార్కు కు నయాపైసా ఇవ్వడం లేదు. ఎయిర్ స్ట్రిప్ లను కూడా కేంద్రం ప్రకటించడం లేదు. పార్లమెంటు లో ఇక కేంద్రం తో బిగ్ ఫైట్స్ ఉంటాయి. సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తాం.

రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ పోస్టును రాజకీయాలకు లాగడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంటు లో తాము జరిపే పోరాటానికి ఇక్కడి కాంగ్రెస్ ,బీజేపీ ఎంపీ లు కలిసి వస్తారో ,రారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ లో కాదు వారు ఢిల్లీ లో మాట్లాడాలన్నారు. సీఎం కెసిఆర్ ఏడేళ్లుగా సమస్యల పై కేంద్రానికి ఉత్తరాలు రాసి అలసిపోయారని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, విద్యుత్ చట్టం తో రైతుల వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెట్టాలని చూస్తూన్నారని, ఈ విధానాన్ని బీజేపీ ఎంపీ లు ఎలా సమర్దిస్తారు అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాలను తొలగించటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ లోపలా..బయటా కలసి వచ్చే పార్టీలతో కలసి పోరాటం చేస్తామన్నారు.

Next Story
Share it