వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్-19 విధుల కోసం నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతోపాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలకు జీతాలు చెల్లించడం లేదు.
కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్న సమయంలో ఎంతో ధైర్యంగా వృత్తిపట్ల నిబద్ధతతో విధులకు వచ్చినవారికి కనీసం జీతం కూడా ఇవ్వకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఎక్కడెక్కడో కరోనా విధులకు వారిని నియమిస్తే ఆ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు చెల్లించుకొంటూ ఆహార, నిత్యావసరాలకు వారు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యయప్రయాసలను ఓర్చుకొంటూ ప్రాణాలను సైతం లెక్కించకుండా ఎంతో గుండె ధైర్యంతో విధులు చేపడుతున్నారు. నెలవారీ జీతం చెల్లింపులకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు అని విమర్శించారు.