Telugu Gateway
Cinema

మీడియాపై కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్

మీడియాపై కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్
X

డ్రగ్స్ కేసులో తనపై ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయకుండా నిలువరించాలని కోరుతూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవరి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అధికారులకు చెప్పిన సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు సారా అలీఖాన్, సిమోన్ ఖంబట్టా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించినట్లు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. తర్వాత ఎన్ సీబీ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఈ తరుణంలో ఆమెను కోర్టును ఆశ్రయించి తనపై వచ్చే కథనాలు ఆపేలా ఆదేశించాలని కోరారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని వ్యాఖ్యానిస్తూ..ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించిన విషయాన్ని గుర్తు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పిటీషన్ ను ఫిర్యాదుగా పరిగణనలోకి తీసుకుని స్పందించాల్సిందిగా సమాచార, ప్రసార శాఖతోపాటు ప్రసార భారతి, ఎన్ బిఏ, ప్రెస్ కౌన్సిల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Next Story
Share it