వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రకటించారు. ఆసరా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయని, నాలుగు విడతల్లో ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ‘‘పీఅండ్జీ, హెచ్యూఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తాం.
పసిపిల్లల నుంచి అవ్వల వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తల్లి, బిడ్డలకు పౌష్టికాహారం అందించేలా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, ఆరేళ్ల పిల్లల నుంచి ఇంటర్ విద్యార్థుల చదువుల కోసం అమ్మఒడి అమలు చేస్తున్నాం. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించాం. హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు ఖర్చు చేశాం. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత అందించాం. ఏడాదికి రూ.18,750ల చొప్పున అందిస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు.