ఏపీ ప్రభుత్వ సలహాదారా..మజాకానా!

జీవీడీ కృష్ణమోహన్ వేతనం 14 వేల నుంచి 2 లక్షలకు పెంపు
నాణ్యమైన పనిచేస్తున్నారంటూ జీవోలో ప్రస్తావన
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు...ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే జీతం ఎంతైనా పెరగొచ్చు. అందుకు ఉదాహరణే ఇది. ఏపీ సర్కారులో జీవీడీ కృష్ణమోహన్ సలహాదారు (కమ్యూనికేషన్స్)గా ఉన్నారు. క్యాబినెట్ ర్యాంక్ కూడా కల్పించింది సర్కారు. ఆయనకు తొలుత బేసిక్ వేతనం అందరి కేబినెట్ మంత్రుల తరహాలోనే 14 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ మూల వేతనం ఏకంగా 14 వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలకు పెరిగింది.
రెండు లక్షల రూపాయల వేతనానికి తోడు చాలా అలవెన్స్ లు కూడా ఉంటాయి. అంటే ఈ లెక్కన జీవీడీ కృష్ణమోహన్ జీతం, అలవెన్స్ లు అన్నీ కలుపుకుంటే నెలకు మూడున్నర లక్షల రూపాయల వరకూ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. నాణ్యమైన పనితోపాటు కమ్యూనికేషన్స్ సలహాదారు పనితీరు ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన నియామకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వేతనాన్నే వర్తించజేయనున్నట్లు ప్రభుత్వ ముఖ్య కారదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఒక్క కృష్ణమోహన్ మాత్రమే నాణ్యమైన పనిచేస్తున్నట్లు సర్కారు చెప్పదలిచిందా?!.