Telugu Gateway
Politics

ఏపీ సీఎంతో సత్సంబంధాలు...అయినా రాజీలేదు

ఏపీ సీఎంతో సత్సంబంధాలు...అయినా రాజీలేదు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని...అంత మాత్రాన తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. మంత్రి ఆదివారం నాడు ట్విట్టర్ లో ‘ఆస్క్ కెటీఆర్’ అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కృష్ణా జలాల పైన తమ చట్టబద్ధ హక్కులకు సంబంధించిన పోరాటం కొనసాగుతుందని, ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పేషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. .పెద్ద ఎత్తున కరోనా చికిత్సకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సందర్భంగా కోరారు. ఇప్పటికే సుమారు 1200 పైగా సెంటర్లలో కరోనా టెస్టింగ్ జరుగుతుందని, ప్రస్తుతం రోజుకు 23 వేలకు పైగా కొనసాగుతున్న టెస్టుల సంఖ్య రానున్న రోజుల్లో 40 వేలకు పైగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉన్నదని, రికవరీ రేటు దేశంలోని అత్యుత్తమంగా 72 శాతంగా నమోదవుతుందని తెలిపారు. తెలంగాణ వచ్చాక అనేక రకాల కార్యక్రమాలు చేపట్టామని శిశు, మాత మరణాలు తగ్గించగలిగామని, ఐదు నూతన మెడికల్ కాలేజ్ లను ప్రారంభించడంతో పాటు పలు ఏరియా ఆసుపత్రిలో ఐ సీయూ యూనిట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. సీఎం కెసిఆర్ యువతకి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆదర్శమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. చదువుకున్న విద్యావంతులు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని ముఖ్యంగా చదువుకున్న యువత సైలెన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటిఎస్, మెట్రోరైల్ వంటి సేవల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఎలిమినేడు ఏరోస్పేస్ పార్క్ కి శంకుస్థాపన ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్ పైన కూడా స్పందించిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మరో సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి స్పందించారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల, మతాలకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలన్నదే తన కోరిక అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కేవలం హైదరాబాద్ పైనే దృష్టి సారిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టి వారితో పని చేయిస్తూ వాటిని సమీక్షిస్తున్నామని త్వరలోనే మంచి ఫలితాలు చూస్తారని మంత్రి అన్నారు

Next Story
Share it