భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశం శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆదాయం పెంచుకోవటంతోపాటు పలు అంశాలపై బోర్డులో విస్తృతంగా చర్చించారు. కరోనా కారణంగా భక్తులు లేకుండానే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయించారు. సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధికమాసం కారణంగా ఈ సారి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు వచ్చాయన్నారు.. అక్టోబర్లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామన్నారు. బోర్డు సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం.
ఇందులో స్థానిక భక్తులను భాగస్వాములను చేస్తూ, దాతల నుండి విరాళాలు సేకరించాలని నిర్ణయించామన్నారు. టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకమీదట నగదు, బంగారు డిపాజిట్లలో ప్రతి నెల కొంత మొత్తానికి గడువు తీరేలా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు తక్కువ వడ్డీ ఇస్తున్నందు వలన టిటిడి డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ వచ్చేలా ఆర్బిఐ, ఇతర బ్యాంకులతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేయనున్నట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్న సుధా నారాయణమూర్తి కోటి రూపాయల విరాళంగా ప్రకటించారు.