Telugu Gateway
Telangana

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహుర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులను సిఎం కెసీఆర్ ఆదేశించారు.సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రతిపాదించారు.

20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలన్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం కావాలని కోరారు.

Next Story
Share it