ఎన్నికల నాటికి చిరు జనసేనలోకి ‘ఎంట్రీ’ ఇస్తారా?

మెగా బ్రదర్స్ పై బిజెపి ఆశలు పెట్టుకుందా?
సోము వీర్రాజుకు చిరు సలహా సంకేతాలేంటి?
ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉంది. అమరావతి కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాం అని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒప్పందం కూడా రాసుకున్నామన్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు ముందు కలిస్తే పొత్తు ఉన్న పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ తో సమావేశం కావాలి. అంతమాత్రాన చిరంజీవి సమావేశం కాకూడదని కాదు. సోము వీర్రాజు ఎవరిని కలవాలో..ఎప్పుడు కలవాలో కూడా పూర్తిగా ఆయన ఇష్టమే. అందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. కానీ ముందు పవన్ కళ్యాణ్ తో కాకుండా చిరంజీవితో సమావేశం అవటం ఇక్కడ కీలకంగా మారింది. అంతే కాదు..ఈ భేటీ అనంతరం సోము వీర్రాజు చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘పార్టీ ని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు పవన్ కళ్యాణ్ సహాయసహకారాలు తీసుకొని ముందుకు వెళ్లమని ఆయన చేసిన సూచన మేము తప్పక పాటించి బీజేపీ-జనసేన పొత్తును ఆంద్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతాము.’ అని పేర్కొన్నారు.
ఇరు పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు ఉన్న సమయంలో జనసేన సహకారం తీసుకోమని చిరంజీవి చెప్పటం ఏంటి?. దీన్ని తాము పాటిస్తామని సోము వీర్రాజు ప్రకటించటం ఏమిటి? అన్నది ఇక్కడ కీలకంగా మారింది. సోము వీర్రాజు నియామకం వెల్లడైన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రకటన విడుదల చేసి ఆయనకు అభినందనలు కూడా తెలిపారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఎన్నికల నాటికి చిరంజీవి కూడా మళ్లీ జనసేనలో చేరి రాజకీయ రంగంలోకి దూకుతారా?. బిజెపి ఇప్పుడు ఏపీ రాజకీయాల కోసం ‘మెగా బ్రదర్స్’పై ఆశలు పెట్టుకుందా?. అంటే తాజా పరిణామాలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి.
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా వదిలేసి సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అంతే కాదు..ఏపీ సీఎం జగన్ తోనూ ఎంతో సఖ్యతతో ఉంటున్నారు. ప్రస్తుతం బిజెపి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టి ఆ స్పేస్ ను తాను అక్రమించాలనే ప్లాన్ లో ఉంది. ఆ దిశగానే బిజెపి వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకే బిజెపి వైసీపీ కంటే ఎక్కువ టీడీపీనే టార్గెట్ చేసింది. ఏది ఏమైనా సోము వీర్రాజు చిరంజీవితో జరిపిన సమావేశం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చను తెరమీదకు తెచ్చిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.