Telugu Gateway
Politics

ఇది మహారాష్ట్ర స్వయంప్రతిపత్తిపై దాడే

ఇది మహారాష్ట్ర స్వయంప్రతిపత్తిపై దాడే
X

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును కేంద్రం సీబీఐకి అప్పగించటంపై శివసేన మండిపడుతోంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహారాష్ట్ర స్వయంపత్రిపత్తిపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మహారాష్ట్ర పోలీసులను అవమానించినట్లేనన్నారు. సామ్నాలో రాసిన వ్యాసంలో ఆయన కేంద్రం తీరును తప్పుపట్టారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒత్తిళ్లు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రౌత్ అన్నారు. సీబీఐని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో తన కాలమ్‌లో పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర ఏజెన్సీ అయినప్పటికీ, అది నిష్పాక్షికంగా దర్యాప్తు జరపదని అనేకసార్లు నిరూపించబడిందని వ్యాఖ్యానించారు. ‘పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయి. శారదా చిట్‌ ఫండ్ కేసులో జోక్యం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో ఉన్నప్పుడు సీబీఐపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వారు వ్యతిరేకించారు.

సుశాంత్‌ కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తే తప్పేంటి? అని సంజయ్‌‌ ప్రశ్నించారు. అలాగే ఓ వర్గం మీడియా సహాయంతో బీజేపీ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్నేళ్లుగా ముంబయ్ లోనే ఉంటున్నాడని, ముంబయ్ నగరమే అతనికి ఎంతో పేరుప్రఖ్యాతులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కష్టకాలంలో కూడా బీహార్ ఎప్పుడూ సుశాంత్ కు అండగా నిలవలేదన్నారు. సుశాంత్ కూడా ఎన్నడూ తన బీహార్ మూలాల గురించి ప్రస్తావించలేదన్నారు. ఈ విషయంలో బీహార్ పోలీసులు జోక్యం చేసుకోండా ఉంటే బాగుండేదన్నారు.కొన్ని రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంపై శివసేన నేతలు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it