ఐదు వందల కోట్ల బడ్జెట్..ఆదిపురుష్..ప్రభాస్
భారతీయ సినిమా రేంజ్ రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ హాలీవుడ్ రేంజ్ వైపు అడుగులు వేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు భారతీయ భాషల్లో చాలా కామన్ అయ్యాయి. తెలుగులో ప్రభాస్, రాణాలు నటించిన బాహుబలి సిరీస్ తోనే అది మొదలైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ జంటగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మంగళవారం నాడు తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. కొత్త సినిమా ప్రకటించటంతోపాటు..ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ ను కూడా విడుదల చేశారు. మరో కీలక అంశం ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు అని టాక్.
ప్రభాస్ 22వ సినిమాకు "ఆదిపురుష్" అనే పేరును ఖరారు చేస్తున్నట్లు దర్శకుడు ఓంరౌత్ ప్రకటించారు. "చెడుపై మంచి సాధించే విజయాన్ని పండగ చేసుకుందాం" అనేది క్యాప్షన్. ఈ పోస్టర్లో హనుమంతునితోపాటు ఎందరో మునులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఇది పౌరాణిక చిత్రమని తేలిపోయింది. త్రీడీలో రూపుదిద్దుకోనుండటం ఈ సినిమా ప్రత్యేకత. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. టీ సిరీస్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం అవుతుండగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటున్నారు చిత్ర యూనిట్.