ఈ సారి మోడీ మొహం చూసి ఓట్లేయరు
ప్రస్తుతం బిజెపిలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు తిరుగులేని నేతలుగా ఉన్నారు. ఎంతగా అంటే పార్టీలో ఎవరూ వాళ్లను ధిక్కరించి మాట్లాడే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఈ తరుణంలో ఓ బిజెపి నేత ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షుడు బన్ సిందార్ భగత్ ఈ సారి మోడీ హవా ఉండదని చెప్పటం కీలకంగా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పని చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇదివరకే మోదీ ముఖం చూసి ఓట్లు వేశారని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదన్నారు.
కేవలం ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే ఓట్లు వేస్తారని అన్నారు. మోదీ పేరుతో ఎన్నికల్లో విజయం సాధించాలనుకోవడం వృథా ప్రయాసేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో నేతల వ్యక్తిగత పనితీరు ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. మోదీ హవా తగ్గిందని ఒప్పుకుంటున్న బన్సిందార్ వ్యాఖ్యలను స్వాతిస్తున్నామని తెలిపింది. మోదీ హవా తగ్గిపోవడం వల్లే ఆయన తన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ప్రదర్శన మెరుగుపర్చుకోమని సూచించారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ ధస్మానా అన్నారు