Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం
X

అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరు. లోకేష్ మీద ఒక వాలంటర్ ను పోటీకి పెట్టి గెలిపిస్తాం, మా సవాల్‌కు చంద్రబాబు రెడీనా’ అని ప్రశ్నించారు. చం‍ద్రబాబు నాయుడు దివాళా తీసిన టీడీపీకి అధ్యక్షులు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రధానమంత్రి, చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఆధారాలు చూపించమంటే చంద్రబాబు చూపించలేక పోయారు. గాలి వార్తలు రాసే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రధానికి ఎలా లేఖ రాస్తారు? చరిత్రలో ఎన్నడూలేని విధంగా సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే చంద్రబాబు దానిని అడ్డుకున్నారు.

అంతర్జాతీయ అవినీతి సంఘానికి చంద్రబాబు అధ్యక్షుడు. 30 లక్షల మంది మహిళల జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారు. కోర్ట్‌ కు వెళ్లి శిఖండిలా చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. స్కాం బాబు అంటే చంద్రబాబు, సూటికెస్ బాబు అంటే చినబాబు. అవినీతికి పేటెంట్ చంద్రబాబు నాయుడు. అవినీతి పరుడైన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ ప్రభుత్వం సుమారు రూ. 60 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసింది. కరోనా సమయంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వదిలి రాకుండా అక్కడి నుంచే జూమ్‌లో మీటింగ్‌లు పెడుతున్నారు అని మండిపడ్డారు.

Next Story
Share it