రాజధాని కేసులో కౌంటర్ కు జనసేన నిర్ణయం

జనసేన రాజధాని కేసులో కౌంటర్ దాఖలుకు రెడీ అవుతోంది. హైకోర్టు ఇఛ్చిన అవకాశం మేరకు ఈ అంశంపై పార్టీ వైఖరిని స్పష్టం చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో ఇదే అంశంపై శనివారం నాడు సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన పార్టీ తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే వస్తోంది. ప్రభుత్వాన్ని విశ్వసించి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను 28వేల మందికి పైగా రైతులు తమ పంట పొలాలను ఇచ్చేశారు.
తమ భూములు ఇచ్చిన వేల మంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని జనసేన బలంగా చెబుతోంది. అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు. పర్యావరణహితమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెబుతూ వస్తున్నాం. ప్రస్తుత తరుణంలో రాజధాని తరలింపు అంశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటికి సంబంధించి పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. హైకోర్టు ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేస్తాం. ఈ కేసులో తుది వరకూ బాధ్యతగా నిలబడతాం. ఈ రోజు పార్టీ ముఖ్యుల అభిప్రాయాలూ తెలుసుకున్నాం. న్యాయ నిపుణుల సలహాలు, వారి సహకారంతో గడువులోగా కౌంటర్ వేస్తాం” అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాజధాని రైతుల విషయంలో మన పార్టీ ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది.
అక్కడి రైతులకు సక్రమంగా కౌలు ఇవ్వడం లేదని గతేడాది మన దృష్టికి రాగానే ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా నిలుస్తాం చెప్పి పర్యటనకు వెళ్ళగానే ఆ మొత్తాలు చెల్లించారు. ఈ ఏడాది కూడా కౌలు ఇవ్వకపోతే వారి పక్షాన బలంగా డిమాండ్ చేశారు” అన్నారు. తోట చంద్ర శేఖర్ మాట్లాడుతూ “వైసీపీ, టిడిపిలు తమ ఆధిపత్య ప్రదర్శనకు రాజధాని అమరావతిని బలి చేస్తున్నారు. ఒక నూతన రాజధానిని నిర్మించుకొనే సదావకాశాన్ని, విలువైన సమయాన్ని ఈ పార్టీలు వృథా చేస్తున్నాయి. మన జనసేన పార్టీ మాత్రమే తొలి నుంచి ఒకే అభిప్రాయాన్ని బలంగా, స్పష్టంగా చెబుతూ వస్తోంది. మన పార్టీ ధర్మం పక్షాన నిలుస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు. కౌంటర్ ను బలంగా దాఖలు చేయాలి” అన్నారు.