Telugu Gateway
Telangana

దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి

దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి
X

దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ‘‘వ్యవసాయం కూడా ఎటు పడితే అటు, ఎలా పడితే అలా నడుస్తున్నది. దేశంలో రకరకాల భూభాగాలున్నాయి. కొండ ప్రాంతాలు, శీతల ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలున్నాయి. ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువైనవో గుర్తించి, వాటినే సాగు చేయించాలి. దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడీ విధానం అవలంభించాలి. వ్యవసాయ ఉత్పత్తులు పెరగగానే సరిపోదు. దానికి అనుగుణమైన మార్కెట్ లేకుంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి పంటలు పండిచే విధానంతో పాటు మార్కెటింగ్ విధానం ఉండాలి’’ అని సిఎం కెసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం, అందరికీ ఆహారం అందిస్తున్న రంగం, పరిశ్రమలకు అత్యంత కీలకమైన ముడి సరుకును అందిస్తున్న రంగం వ్యవసాయ రంగమే అని సిఎం చెప్పారు. భారత దేశానిది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతున్నదని సిఎం అన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని సిఎం కోరారు.

నాబార్డ్ చైర్మన్ జి.ఆర్.చింతల, గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు బృందంతో సిఎం సమావేశమయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ‘‘భారతదేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయ దారులే. దేశం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఇంత జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో మరో దేశమేదీ తిండి పెట్టలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలి. దీంతో పాటు వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీనికోసం నాబార్డు అధ్యయనం చేయాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

Next Story
Share it