వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతలకు జగన్ శంకుస్థాపన

కృష్ణా జిల్లాలోని ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శుక్రవారం నాడు శంఖుస్థాపన చేశారు. తాడేపల్లి నుంచే రిమోట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదాద్రిలో చేపట్టనున్న ఎత్తిపోతల పథకాన్ని 14 నెలల్లోనే శ్రీకారం చుట్టామన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో సమస్యలను పట్టించుకోలేదన్నారు. 2021 ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు.
491 కోట్ల రూపాయల వ్యయంతో 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వేదాద్రి గ్రామంలో ఎత్తిపోతల పథకానికి మంత్రి అనిల్కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది.