కోర్టు కేసులు ఉండగా శంకుస్థాపన ముహుర్తాలా?

మూడు రాజధానుల వ్యవహారం కోర్టుల్లో ఉంటే శంకుస్థాపనకు ముహుర్తాలు ఎలా పెడతారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలంతా కరోనాతో నానా కష్టాలు పడుతుంటే సర్కారు ఈ సమస్యను వదిలేసిందని విమర్శించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇబ్బంది వస్తుందని, అన్నీ తెలుసని మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి కానీ..అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కాదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం దృష్టి అంతా ప్రతిపక్షం మీద తప్ప..కరోనా సమస్య మీద లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సీనియర్ నాయకుడిగా ప్రజలను చైతన్యవంతులను చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు. సోమవారం నాడు ఆన్లైన్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏది నిజమైన అభివృద్ధి.. ఏది నిజమైన విధ్వంసమో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. 13 జిల్లాలకు టీడీపీ హయాంలో మేం ఏం చేశామో చెబుతామని.. 13 నెలల్లో వైసీపీ ఏం చెసిందో చెప్పగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగువారి శ్రేయస్సు తప్ప మరేది టీడీపీ ఆలోచించలేదన్నారు.