వర్మపై సినిమాలే సినిమాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ‘పవర్ స్టార్’ సినిమా ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే పరాన్నజీవి అనే సినిమా వచ్చింది.. పోయింది. వర్మ తీసిన పవర్ స్టార్ సినిమాది కూడా అదే బాపతు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై మరో సినిమా రెడీ అవుతోంది. అది ‘రాంగ్ గోపాల్ వర్మ’. ఇది అంతా ఒకెత్తు అయితే వర్మ జీవిత కథ ఆధారంగా ‘రాము’ పేరుతో సినిమా రానుంది. వర్మ గురించి చెప్పాలంటే మామూలు విషయమా?. అందుకే దీన్ని మూడు భాగాలుగా తీస్తున్నారంట. మూడవ భాగంలోనే తన జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన ఘటనలతోపాటు మసాలా సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు వర్మ. రామూ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి రెండు భాగాల్లో వేరే నటులు నటించబోతుండగా చివరి భాగంలో ఆర్జీవీయే స్వయంగా నటించనున్నారు.
తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. నగ్నసత్యంగా నా జీవితాన్ని చూపించనున్నాను. నా లైఫ్లో జరిగిన సంఘటనల గురించి చిత్ర యూనిట్కు తెలిపాను. కానీ వాళ్లు అప్పటికే నా గురించి పరిశోధన చేసి చాలావరకు తెలుసుకున్నారు. 2008 డిసెంబర్లో ముంబయ్ పేలుళ్ల తర్వాత నేను, నటుడు రితేష్ దేశ్ముఖ్ తాజ్ హోటల్కు వెళ్లాం. అప్పుడేం జరిగిందనే వివరాలు కూడా సినిమాలో చూపిస్తాం. నిజానికి ఆ సమయంలో అక్కడికి వెళ్లడమే తప్పు కాబట్టి ఈ విషయాన్ని నేనెప్పుడూ వెల్లడించలేదు. నేను రంగుల జీవితాన్ని అనుభవించాను. కాబట్టి అమ్మాయిలతో పెట్టుకున్న సంబంధాలను కూడా చూపిస్తాను. సినిమాలో అదే ఎక్కువగా రక్తికడుతుందని నేను భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.