నిమ్మగడ్డపై వైసీపీ ఎటాక్

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై అధికార వైసీపీ తన విమర్శల దూకుడు కొనసాగిస్తోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు ఓ లేఖ రాస్తూ హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా?. లేక హైకోర్టులో రమేష్ కుమార్ వేసిన కోర్టు ధిక్కార పిటీషన్ పై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించామనే కారణం చూపి మరింత జాప్యం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. దీంతో సర్కారు వ్యూహం ఎలా ఉండబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ రెడ్డి మరోసారి రమేష్ కుమార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు.
ఎస్ఈసీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రవర్తించడం లేదని అన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్న నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు ఏదోరకంగా ప్రభుత్వంపై విషయం చిమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు.