Telugu Gateway
Politics

కెసీఆర్ ఆదేశాలతోనే ప్రార్ధనా మందిరాలు కూల్చారు

కెసీఆర్ ఆదేశాలతోనే ప్రార్ధనా మందిరాలు కూల్చారు
X

కొడుకును సీఎం చేసేందుకే ఈ నిర్ణయం. రేవంత్ రెడ్డి

హిందూ..ముస్లింలకు ఇది బ్లాక్ డే. షబ్బీర్ అలీ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశాలతోనే సచివాలయంలోని ప్రార్ధనా మందిరాలను కూల్చేశారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ కు పిచ్చి ముదిరి పాకాన పడింది. మత విశ్వాసాలకు విఘాతం కలిగేలా కేసీఆర్ వ్యవహరించారు. కొడుకును సీఎం చేయటమే కోసమే సచివాలయం కూల్చివేత నిర్ణయం. ఈ రోజు తెలంగాణకు బ్లాక్ డే. 16 మంది సీఎంల కుమారులు ఎవరూ సీఎంలు కాలేదు అని వాస్తుపండితుడు చెప్పడంతోనే కేసీఆర్ సెక్రటేరియట్ కూల్చి వేతకు పూనుకున్నారు. పాలకుల మూఢ నమ్మకాలతో రాష్ట్రానికి వందల, వేల కోట్ల భారం వేయకూడదు. పర్యావరణ శాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కూల్చి వేత జరుగుతోంది. 2008లో సెక్రటేరియట్ లో మజీదు నిర్మించారు. నల్ల పోచమ్మ దేవాలయం అనేక ఏళ్ల నుంచి ఉంది. ఒక మూర్ఖుడు ఆదేశాలు ఇస్తే సీఎస్, డీజీపీలు ప్రార్థనా మందిరాలు కూల్చి వేయించారు.

బీజేపీ, ఎంఐఎం ఎందుకు నోరు మెదపడం లేదు. కేసీఆర్ ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడుతున్నారు. దేశంలో హిందూ-ముస్లీం చావులకు బీజేపీ, ఎంఐఎంలే కారణం. మత విశ్వాసం సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల నాయకుల సొత్తా... వారి అబ్బజాగీరా. ట్రాఫిక్ సమస్య వల్ల ప్రార్థనా మందిరాలను కూల్చి వేస్తుంటే అసద్ వచ్చి రోడ్డు పై కూర్చున్నాడు. సెక్రటేరియట్లో ప్రార్థనా మందిరాలు కూల్చేస్తే ఎందుకు నోరు మెదపరు. బాబ్రీ కేసులో సుప్రీం తీర్పును సైతం అసద్ ఒప్పుకోనన్నారు. సెక్రటేరియట్ మందిరాల విషయంలో మాత్రం మళ్లీ కట్టిస్తానన్నాడని కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అంతా ఒకటే గుంపు. కూల్చివేత పై కేసు నమోదు చేసి కేసీఆర్, సీఎస్, డీజీపీలను జైలుకు పంపాలి’ అని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కుర్చీలు వేసుకుని డ్యాంలు కట్టిస్తాను అనే కేసీఆర్ ఇప్పుడు మందిరాలు నిర్మిస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సెంటిమెంట్ కోసం వెయి కోట్ల ఆస్తి ధ్వసం చేశారు... మందిరాలు కూల్చి మత విశ్వాసాలు కూల్చి వేశారన్నారు. ఎంఐఎంకు సిగ్గుశరం ఉండాలని, రామమందిరం – బాబ్రీ పేరుతో ఎందరి ప్రాణాలు బలి తీసుకున్నారని ప్రశ్నించారు. బాబ్రీ మజీదు విషయంలో అసద్ ఏం మాట్లాడాడు... సెక్రటేరియట్ మజీదు విషయంలో ఏం మాట్లాడుతున్నాడు. బిల్డింగ్ పడటం వల్లే మజీద్ కూలింది అంటున్నారు... నల్లపోచమ్మ మందిరం దూరంగా ఉంది... అది ఎలా కూలింది అని షబ్బీర్ ప్రశ్నించారు. హిందు, ముస్లీంల అందరికీ ఈ రోజు బ్లాక్ డే అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it