రాఫెల్ విమానాలు వస్తున్నాయి
భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దేశ వాయుసేన మరింత శక్తివంతం కాబోతోంది. ఫ్రాన్స్ నుంచి తొలి విడతలో ఐదు రాఫెల్ విమానాలు బయలుదేరాయి. ఈ నెల 29 నాటికి అవి దేశంలోకి రానున్నాయి. భారత్ ఫ్రాన్స్ నుంచి ఈ విమానాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు ఎల్లుండి భారత్లోని అంబాలా వైమానికి స్థావరానికి చేరనున్నాయి. భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు.
సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్నాథ్కు పార్లే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం ప్రయాణంలో మార్గమధ్యంలోనే ఇవి ఇంథనాన్ని నింపుకోనున్నాయి. ట్యాంకర్ విమానం సాయంతో ఈ పని పూర్తి చేస్తాయి. భారత్ కు రాగానే వీటిని అంబాలా ఎయిర్ బేస్ కు తరలించనున్నారు. రాఫెల్ విమానాల రాకను దృష్టిలో పెట్టుకుని వాయుసేనలోని 12 మంది పైలట్లకు వీటిని నడిపే శిక్షణ ఇప్పించారు.