లద్దాఖ్ లో మోడీ పర్యటన
ప్రధాని నరేంద్రమోడీ ఆకస్మికంగా లద్దాఖ్ పర్యటన తలపెట్టారు. ఆయన శుక్రవారం ఉదయమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో కలసి ఈ పర్యటనకు వెళ్ళారు. వీరితోపాటు ఆర్మీ చీఫ్ ఎం ఎం నరవణే కూడా ఉన్నారు. భారత్ -చైనా సరిహద్దు వెంట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ ఈ పర్యటన తలపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో తాజా పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకున్నారు. గల్వాన్ లో జరిగిన దాడిలో గాయపడ్డ సైనికులను మోదీ పరామర్శించారు.
సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం పంపాలనే ఉద్దేశంతోనే ప్రధాని ఈ పర్యటన తలపెట్టినట్లు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నా సరిహద్దుల్లో మాత్రం ఇటీవల వరకూ ఇరుపక్షాలు భారీ ఎత్తున బలగాలను మొహరించాయి. సరిహద్దులో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనా సైనికులు కూడా ఇంత కంటే రెట్టింపు సంఖ్యలోనే మరణించిన సంఖ్య విషయం మొదలుకుని మరణాల విషయాన్ని కూడా చైనా గోప్యంగానే ఉంచుతోంది.