ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది. రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కేసును విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రమేష్ కుమార్ తరపున హరీశ్ సాల్వే వాదనలు విన్పించారు. కోర్టు ఇఛ్చిన తీర్పులను రాష్ట్రం అమలు చేయటంలేదని..పైగా తీర్చు వెలువరించిన సందర్భంగా అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ విషయంలో ఏపీలో ఏమి జరుగుతుందో అంతా తమకు తెలుసని వ్యాఖ్యానించారు. అందుకే తాము కూడా ఈ కేసులో స్టే ఇవ్వలేదని తెలిపారు. గవర్నర్ లేఖ పంపినా కూడా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణం అని చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇఛ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటంలేదని..హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోసం సుప్రీంకోర్టు కు వచ్చినందున స్టే ఇవ్వకూడదని హరీష్ శాల్వే వాదించారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ విషయంలో తాము స్టే ఇవ్వటంలేదని..వారం రోజుల్లో రమేష్ కుమార్ తన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.