Telugu Gateway
Politics

తెలంగాణాలో నీచమైన..దుర్మార్గపాలన

తెలంగాణాలో నీచమైన..దుర్మార్గపాలన
X

సీఎస్..డీజీపీలు ఇకనైనా మానవత్వంతో పనిచేయాలి

వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారు

జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 17 వార్డు కౌన్సిలర్ గౌసియా బేగం కరోనాతో మృతి చెందారని తెలిపారు. గత ఐదు రోజులుగా ఆమె చికిత్స కోసం తిరగని ఆస్పత్రిలేదని ఎక్కడా బెడ్స్ ఖాళీలేవని తెలిపారు. ప్రతి ఆస్పత్రి దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉందని, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లేదని విమర్శించారు. చివరికి గాంధీ ఆస్పత్రిలో చేర్పించినా ఆక్సిజన్ అందక చనిపోయిందని తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న తనకే ఎంత ప్రయత్నించినా బెడ్స్ దొరక్క, కౌన్సిలర్ ను కాపాడులేకపోయానని..ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. జగ్గారెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘రాష్ట్రంలో ఒక నీచమైన, దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారు. జిల్లా మంత్రిగా ఉండి హరీష్ రావు జిల్లా హాస్పిటల్ పరిస్థితి తెలుసుకోలేదు సిగ్గుండాలి.

కరోనాతో కోలుకున్న వారికి ఫోన్ చేయడం కాదు కరోనా పేషంట్స్ కు ఫోన్ చేసి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవాలి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నావు..ఎక్కడ ఉన్నావు.ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా...? మానవత్వం అనేదే లేదా మీకు..? సీఎం ,మంత్రులు,ఎమ్మెల్యే లకు వస్తే ఏం కాదు ఎలాగో అలా ట్రీట్మెంట్ చేపించకుంటారు. రాష్ట్రం లో ఐ ఏఎస్ ,ఐపీఎస్ లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సామాన్య ప్రజలకు అలాంటి పరిస్థితి ఉండదు. ఇకనైనా సీఎస్,డీజీపీ లు మానవత్వం తో పని చేయాలి. సీఎం తో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. కేసీఆర్ కి వాస్తవ పరిస్థితులు ఏంటో చెప్పండి. ప్రతిసారి జీతం కోసం కాదు కొన్ని సార్లు మానవత్వం తో పని చేయండి. అధికారులు, మంత్రులు కేసీఆర్ కి ఊడిగం చేసింది చాలు. ఇకనైనా కేసీఆర్ కు భజనలు చేయడం మానేసి మానవత్వం తో పని చేయండి.

ఈటెల రాజేందర్ మీకు మంచి పేరుంది. ప్రజలను కాపాడుకోలేన్నప్పుడు ఎందుకు మంత్రి పదవిలో ఉన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కేసీఆర్ ఇక నైనా రంగప్రవేశం చేసి ప్రజల ప్రాణాలను కాపాడండి. మీ దగ్గర ఎన్నికల ముందు ఎకరానికి 5 వేలు తీసుకొని ఓట్లు వేసినందుకు రైతులు ఈ రోజు బాధపడుతున్నారు. మీరు ఇచ్చిన 2 వేలు ,మద్యం తీసుకొని ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు. తక్షణమే కేసీఆర్ లక్ష వెంటిలేటర్లు,2 లక్షల ఆక్సిజన్ లను ఏర్పాటు చేయాలి. వెంటనే గాంధీ ఆస్పత్రి కి 3 వేల కోట్లు,జిల్లాల ఆసుపత్రులకు 2 వేల కోట్ల విడుదల చేయాలి.. లేదంటే ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని నిరసన తెలుపుతా’ అని ప్రకటించారు.

Next Story
Share it