Telugu Gateway
Telangana

కొండపోచమ్మ ప్రాజెక్టుపై బురద చల్లొద్దు

కొండపోచమ్మ ప్రాజెక్టుపై బురద చల్లొద్దు
X

కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువకు గండి పడిన వ్యవహారంపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. చిన్న గండిపై కాంగ్రెస్, బిజెపిలు రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. చేతనైతే మంచి సలహాలు ఇవ్వాలి కానీ..ఇలా బురద చల్లే రాజకీయాలు చేయవద్దని వ్యాఖ్యానించారు. హరీష్ రావు గజ్వేల్ లో మీడియాతో మాట్లాడారు. కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్స్, బీజేపీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్. కాంగ్రెస్స్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయం మరిచిపోయి మాట్లాడం విడ్డురంగా ఉంది. ఎస్సారెస్పీ ఓపెన్ చేసినప్పుడు కూడా 131,118 కిలోమీటర్ల వద్ద కాలువ బ్రీచ్ అయ్యింది. ఖమ్మం జిల్లాలో పాలెం వాగు ప్రాజెక్టు 04, 07,2007 వ రోజు కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రెడీ కాకముందే కొట్టుకొనిపోయింది.

దాని నిర్మాణంలో లోపం ఉందని అప్పటి కాంగ్రెస్స్ వారు దాన్ని వదిలేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పైపులు పటాకుల లాగా పేలిపోయాయి. అప్పుడు మంత్రులుగా ఉత్తమ్, పొన్నాల ఉన్నారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాలువలకు కూడా 200 సార్లు గండి పడింది. ఇటీవలే మనోహరబాద్ లో కురిసిన వర్షానికి రైల్వే లైన్ తెగి కొట్టుకొనిపోయింది.. దీనికి కారణం ప్రధానమంత్రి అని మేము అంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా?. కాంగ్రెస్స్ హయాంలో నీరు,కరెంట్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టారు. అసాధ్యం అనుకున్న గోదావరి నీటిని తెచ్చి రైతులకు అందించిన ఘనత కేసీఆర్ కే క్కింది. కాంగ్రెస్స్ పార్టీ అంటే గోబెల్స్ పార్టీ అని ముద్ర పడింది... దీని వల్లే ప్రతి పక్ష హోదా కూడా కోల్పోయింది. కరీంనగర్ లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చెరువులు నింపాం’ అని హరీష్ రావు తెలిపారు.రెండు రోజుల్లో కాలువ గండి పనులు పూర్తి అయి..మళ్ళీ నీరు సరఫరా ప్రారంభిస్తామని హరీష్ రావు వెల్లడించారు.

Next Story
Share it