ఉస్మానియా ఖాళీ స్థలంలోనే కొత్త భవనాలు కట్టాలి
నిజాం కాలంలో కట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చాలనే ప్రతిపాదనను సర్కారు విరమించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆస్పత్రిలో ఉన్న ఆరు ఎకరాల ఖాళీ స్థలంలో కొత్త భవనాలు కట్టాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఉస్మానియా సూపరింటెండెంట్ తో సమావేశం అయి ఆస్పత్రి పరిస్థితి పై చర్చించారు.ఉస్మానియా భవనం కూలిపోయే దశలో ఉందని, భవనాల ఫ్లోరింగ్ దారుణంగా ఉందన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని వదలివేసి కాంగ్రెస్ పై టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. నిజాం కట్టిన భవనాలను కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, అద్భుతమైన సచివాలయాన్ని మూడనమ్మకాల కోసం కూలగొట్టడం దారుణమని అన్నారు. గత నాలుగేళ్లుగా 500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెట్టినా ఎందుకు ఖర్చు చేయలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.