కరోనా టెస్ట్ లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి కరోనా టెస్ట్ లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు ఎక్కువ వస్తున్నాయని టెస్ట్ లు తగ్గించటంలేదని..అదే సమయంలో రిపోర్టుల్లో కేసులను తక్కువ చేసి కూడా ఏమీ చూపించటంలేదన్నారు. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం జగన్ మంగళవారం నాడు కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 6 వేలకు పైగా కేసులు వచ్చాయి. రోజూ 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నది ఏపీలోనే. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదేనని తెలిపారు. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయని వివరించారు. కొవిడ్ వస్తుంది, పోతుంది... ఇప్పటి పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చేవరకూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అధికారులు అందరూ కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా పై ఎవరికీ భయాందోళన ఉండకూడదన్నారు సీఎం జగన్.