జగన్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఒకేసారి వెయ్యికిపైగా 108, 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్ డ్రైవర్లకు జీతాలు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 20 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 108 సిబ్బంది జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్ టెక్నీయన్ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్ చెప్పారు. పెంచిన జీతాలు జులై 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.