కేంద్రం మద్దతు లేకుండా ఈ బిల్లులు బయటపడ్డాయా?

అక్కడ అసెంబ్లీ సమావేశాలకే ఏడ్పించారు..ఇక్కడ?
మూడు రాజధానులకు బిజెపి సంపూర్ణ మద్దతు!
పైకి చెప్పేదొకటి..లోపల చేసేదొకటి
రాజస్ధాన్ లో అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటాం అనుమతించండి అంటే అక్కడి గవర్నర్ కల్ రాజజ్ మిశ్రా ఏకంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కే చుక్కలు చూపించారు. మూడు సార్లు మంత్రివర్గ తీర్మానాలు చేసి అడిగిన తర్వాత నాలుగోసారి ఏదో దయదలచి చాలా గ్యాప్ తీసుకుని మరీ సమావేశాలకు ఓకే చెప్పారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఏపీ సర్కారు తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారం చూసుకుందాం. నిబంధనల ప్రకారం ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదించటాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఓ సారి తిప్పి పంపితే..మళ్ళీ రెండోసారి సర్కారు ఆమోదం కోసం పంపినప్పుడు అప్పుడైనా గవర్నర్ సంతకం చేయాల్సిందే. నిజంగా కేంద్రంలో అధికారంలో చలాయిస్తున్న బిజెపి కనుక ఏపీలో మూడు రాజధానులు వద్దు అనుకుంటే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ఢిల్లీ పంపటమో..లేక మరేదో చేసేవారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
చట్టబద్దంగా ఎన్నికైన సీఎం అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవటానికే నానా ఇబ్బందులు పెట్టిన గవర్నర్ ఉన్న ఈ దేశంలో..కేంద్రం క్లియరెన్స్ లేకుండా అత్యంత కీలకమైన మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందటం అనేది ఏ మాత్రం సాధ్యంకాదన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికైన ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. కానీ అమరావతిలో విషయంలో రాజధాని కోసం భూముల ఇఛ్చిన రైతుల పరిస్థితి ఏంటి?. ఇఫ్పటికే అక్కడ ఖర్చు పెట్టిన దాదాపు పది వేల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి?, ఓ వైపు రాష్ట్రం ఆర్ధికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో మూడు రాజధానులు లాభదాయకమా వంటి ఎన్నో ప్రశ్నలు ఉన్న సమయంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీటికి ఆమోదం తెలపటం అంటే అంతా ‘పై నుంచి’ జరగుతున్న వ్యవహారం తప్ప మరొకటి కాదని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అటు కేంద్రం కానీ..ఇటు బిజెపి కానీ మూడు రాజధానులకు వ్యతిరేకం అయితే..వీటిని ఆపటానికి ఆ పార్టీ దగ్గర..కేంద్రం దగ్గర ఎన్నో అంశాలు ఉన్నాయని..అయినా సరే కూల్ గా పనికానిచ్చేశారంటే ఇది ఖచ్చితంగా బిజెపి మద్దతుతో సాగిన వ్యవహారమే అని చెబుతున్నారు.