గవర్నర్ కు చంద్రబాబు లేఖ అందుకే

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాశారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిలో రాజధాని పూర్తి చేయాలంటే చంద్రబాబు లెక్కల ప్రకారమే లక్ష కోట్ల రూపాయలు అవుతుందని..పూర్తయ్యే సరికి ఆ మొత్తం ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని బొత్స తెలిపారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇఛ్చిన హామీ ప్రకారమే పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ జిల్లా చేయనున్నట్లు తెలిపారు. కర్నూలు, అమరావతి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం జగన్ మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
నిపుణుల కమిటీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు చంద్రబాబు పచ్చి అబద్దమాడుతున్నారని విమర్శించారు. "శివరామ కృష్ణన్ కమిటీ నివేదికలో మూడు రాజధానుల అంశం కనిపిస్తోంది. అప్పుడు కేంద్రం నియమించిన కమిటీ సైతం మూడు రాజధానుల విషయం ప్రస్తావించింది. కేవలం చంద్రబాబు నాయుడు నియమించిన నారాయణ కమిటీ మాత్రమే అమరావతిని సిఫారసు చేసింది. అది కూడా బాబు చేసిన సిఫారసు. అమరావతి పేరిట వేల కోట్ల వృధాకు బాబు ప్రయత్నించారు’ అని బొత్స తెలిపారు.