Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
X

వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెచ్చరిక

కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకటన

కరోనా టెస్ట్ ల విషయంలో తెలంగాణ సర్కారు తమ ఆదేశాలను అమలు చేయటంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కనపరిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాము చేపట్టబోయే చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య విభాగం డైరక్టర్ బాధ్యులు అవుతారని పేర్కొంది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహాలకు సైతం కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది.

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. విచారణ జరగాల్సి ఉందని ఏజీ కోర్టుకు నివేదించటంతో సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులు కరోనా సోకిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరిక జారీ చేసింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖ ను ఆదేశించారు. కరోనా కేసుల గణాంకాలు పత్రికలు, వెబ్ సైట్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది.

Next Story
Share it