Telugu Gateway
Politics

పీవీ 360 డిగ్రీస్ పర్సనాలిటీ..కెసీఆర్ ప్రశంసలు

పీవీ 360 డిగ్రీస్ పర్సనాలిటీ..కెసీఆర్ ప్రశంసలు
X

దివంగత మాజీ ప్రధాని పీ వీ నరసింహరావు ఎక్కడ పనిచేస్తే అక్కడ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారని..అదే ఆయన గొప్పతనం అని తెలంగాణ సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. పీవీ రాజకీయ జీవితంలో కుల, ధన బలాల పార్శమే లేదని అన్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన పీవీ స్వయంకృషితో సీఎం, పీఎం పదవులను కూడా అధిష్టించారని తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కెసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత్‌కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ అని కెసీఆర్ పేర్కొన్నారు. ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పీవీ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్‌ పర్సనాలిటీ పీవీ నరసింహారావు కొనియాడారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలియని, గొప్ప సంస్కరణ శీలి అని అన్నారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని సీఎం కీర్తించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గురుకుల పాఠశాలలను తీసుకొచ్చింది పీవీనే అని, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన నేత పీవీ నరసింహరావు అని.. మన పీవీ మన తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. భూసంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది పేదలకు న్యాయం చేశారన్నారు. విద్యాశాఖను మానవవనరుల శాఖగా మార్చడమే కాకుండా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టి అనేక మంది ప్రతిభావంతుల్ని దేశానికి అందించారన్నారు. పీవీ చరిత్రపై ఓ పుస్తకమే రాయొచ్చని అన్నారు. నెహ్రుకు సమాంతర వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ శత జయంతి ఉత్సవాలను 50 దేశాల్లో నిర్వహించనున్నట్లు కెసీఆర్ ప్రకటించారు.

Next Story
Share it