ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు
ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులు చిత్రీకరించుకోవటం మానుకోవాలని ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించటం ప్రజాస్వామిక హక్కు అన్నారు. వాస్తవం తమ చెవిన పడే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రశ్నించే వారిపై దుష్ప్రచారం చేయటం మానుకోవాలని ప్రధానితో పాటు ఆయన మద్దతుదారులను కోరుతున్నట్లు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను భావోద్వేగాలతో తప్పుదారిపట్టించరాదని ఆయన ఆరోపించారు.
చైనా మన భూబాగాన్ని ఆక్రమించలేదని, మన పోస్ట్ ను స్వాధీనం చేసుకోలేదని అఖిలపక్ష భేటీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన వారిపై తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారని ప్రచారం చేయడం పట్ల కమల్ హాసన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ప్రకటనలతోనే ప్రజల్ని భావోద్వేగపూరిత పద్ధతుల్లో తప్పుదారిపట్టిస్తోందని అన్నారు. ప్రధాని అఖిలపక్ష సమావేశంలో వెల్లడించిన అంశాలు ఆర్మీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.