బెదిరిస్తే భయపడేందుకు ఇక్కడ ఎవరూ లేరు
‘చట్టపరంగా, ప్రజాస్వామ్యపరంగా ప్రవర్తించండి. బెదిరిస్తాం..బ్లాక్ మెయిల్ చేస్తామంటే కుదరదు. బెదిరిస్తే భయపడేందుకు ఇక్కడ ఎవరూ లేరు. వైసీపీ నేతలు తమ మాటలు..భాష సరిచేసుకోవాలి. రాజ్యాంగానికి లోబడే ఎవరైనా పనిచేయాలి. ఏభై ఏళ్ళలో చేసే అవినీతి ఏడాదిలో చేశారు.’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ను చంద్రబాబు తప్పుపట్టారు. ఈఎస్ఐ మాన్యువల్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని, కేటాయింపుల్లో మంత్రి ఎక్కడా ఉండడని, అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగితే.. అధికారుల పాత్రపై విచారణ జరిపించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై అచ్చెన్నాయుడు ప్రశ్నించినందుకు.. ప్రభుత్వ అవకతవకలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపినందుకే ఆయనను అరెస్టు చేశారని చంద్రబాబు తెలిపారు.
అవినీతిపై గొంతెత్తి పోరాడే నాయకుడు అచ్చెన్నాయుడని చంద్రబాబు అన్నారు. అందుకే ఆయనను వేధిస్తున్నరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు అడినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించినట్టే.. వైసీపీ ప్రభుత్వ దోపిడిని అడ్డుకుంటున్నామనే ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘తప్పుడు కేసులు పెట్టి, చట్ట ఉల్లంఘన చేసి.. అచ్చెన్నాయుడిని బలిపశువును చేయాలని చూస్తున్నారు. రూ.40 వేల కోట్ల అవినీతి చేసి, 11 ఛార్జ్ షీట్లలో ఏ-1గా ఉన్న జగన్.. అందరిపై బురదజల్లి పైశాచిక ఆనందం పొందాలనుకోవడం దుర్మార్గం. 14 ఏళ్లు సీఎంగా చేశాను. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చూడలేదు. జగన్ విధ్వంసం పరాకాష్టకు చేరింది. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి ఒక్కఛాన్స్ అడిగాడు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. 34 సంక్షేమ పథకాలను తీసేశారు. రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకుంటున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.