ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన పద్దతినే ఏపీకి కూడా అనుసరించటం ఉత్తమం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో కోరారు. ఈ తరుణంలో పరీక్షల పేరుతో విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏ మాత్రం సరికాదన్నారు. ఆంధ్ర్రప్రదేశ్ కి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవన్నారు. ఏపీలో ఇఫ్పటికే ఆరు వేల కరోనా కేసులు నమోదు అయ్యాయని, ఈ తరుణంలో పరీక్షా కేంద్రాలకు పిల్లలను తీసుకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోందని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాలా తక్కువగా వుంది. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తరవాతే ఇటువంటి డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వం విజ్ఞతతో పిల్లల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.