అంత ఆదా చేసిన జీఎంఆర్ జీవోలో అన్ని రహస్యాలేంటో?!

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టులో తాము ఎంతో ఆదా చేశామని సర్కారు డప్పు కొట్టుకుంటోంది. ఏపీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం వరకూ అదే మాట చెబుతున్నారు. గతంలో భోగాపురం విమానాశ్రయంలో పెద్ద స్కామ్ ఉందని...జీఎంఆర్ కు ఇచ్చేందుకే చంద్రబాబు సర్కారు కుట్ర చేసిందని వీడియో సాక్షిగా ఆరోపించిన అజయ్ కల్లాం ఇప్పుడు అదే జీఎంఆర్ కు ఇవ్వటం ద్వారా కూడా ఆదా చేశామని చెబుతున్నారు. ఇదే అంశంపై శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా..‘ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వలేదనే భోగాపురాన్ని ప్రశ్నించినట్లు సమాధానం ఇచ్చారు. ఈ విషయం పత్రికల్లో వచ్చింది. మరి జీఎంఆర్ ప్రభుత్వ రంగ సంస్థా?. ఆయన ఆరోపణలు చేసింది కూడా జీఎంఆర్ కు ఇవ్వటానికే ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెట్టారు అని. ఇప్పుడు మాత్రం ఆ మాట ఎత్తటం లేదు. పోనీ అజయ్ కల్లాం చెప్పినట్లు 2700 ఎకరాల నుంచి 2200 ఎకరాలకు తగ్గించటం వల్ల ఏకరాకు మూడు కోట్ల లెక్కన వేసుకున్నా కూడా 1500 కోట్ల ఆదా చేశామని చెప్పుకుంటున్నారు.
అసలు ఏపీ సర్కారుకు చెందిన ఆర్ధిక శాఖ అప్పట్లో లేవనెత్తిన అభ్యంతరాలు అన్నీ అజయ్ కల్లాం చెబుతున్న లెక్కలకు భిన్నమైనవి. అసలు టిక్కెట్ ధర ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు?. ఆ సంస్థకు అడ్డగోలుగా ఎలా రాయితీలు ఇస్తారనే ప్రశ్నించింది ఆర్ధిక శాఖ. ఇదే విషయాన్ని అప్పట్లో సాక్షి కూడా ప్రముఖంగా రాసింది. ఇదంతా పక్కన పెడితే..అంతా పారదర్శకంగా చేసి..ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు 1500 కోట్ల రూపాయలు ఆదా చేసిన సర్కారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)మోడల్ లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు ముసాయిదా రాయితీ ఒప్పందం జీవోలను ఎందుకు రహస్యంగా పెట్టినట్లు?. సర్కారుతో ఒప్పందం కావటమే తరువాయి ఆగమేఘాల మీద అంటే శుక్రవారం నాడే జీవోలు వచ్చాయి. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదు. కానీ ఈ జీవోలను ఓపెన్ చేస్తే మాత్రం కాన్ఫిడెన్షియల్ (రహస్యం) అన్న ఒక్క లైన్ తప్ప ఏమీ రావటం లేదు. పారదర్శకంగా చేసే ఈ ప్రభుత్వంలో రహస్యాలు ఏమి ఉంటాయి. అవేంటో?. ఈ వార్త అప్ లోడ్ చేసే శనివారం మధ్యాహ్నాం 1.20 గంటల వరకూ జీవోలు ఓపెన్ చేస్తే ‘కాన్షిడెన్షియల్’ అని మాత్రమే వస్తుంది తప్ప..జీవోల్లో ఎలాంటి సమాచారం లేదు.