Telugu Gateway
Andhra Pradesh

బిజెపి ముసుగులో అనైతిక పనులు

బిజెపి ముసుగులో అనైతిక పనులు
X

వైసీపీ ‘ఆ ముగ్గురి భేటీ’పై ఎటాక్ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి బిజెపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి ముసుగులోకి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు అనైతిక పనులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డైరక్షన్‌లోనే వారు ముగ్గురు రహస్య మంతనాలు జరిపారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చాకే వారిని కలిసినట్టు సుజనా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.

13వ తేదీన భేటీ జరిగితే.. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదన్నారు. కలిస్తే తప్పేంటని ప్రశ్నించడం చూస్తుంటే వారు బరితెగించారని అర్థం అవుతుందన్నారు. కాపులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అంబటి విమర్శించారు. కాపుల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాపులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అనేక పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు.

Next Story
Share it