వడ్డీ వ్యాపారిలా వ్యవహరించొద్దు
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వడ్డీ వ్యాపారిలాగా వ్యవహరించటం మానేసి..పేదలు, ఇతర బలహీన వర్గాల ప్రజలకు నేరుగా నగదు అందే ఏర్పాట్లు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాంతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పేదలకు నగదు అందేలా చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కంటే ఆర్ధికపరంగా ఎదురయ్యే సవాళ్లు దేశానికి మరింత నష్టం చేయనున్నాయని పేర్కొన్నారు. డిమాండ్ ను కల్పించటంలో విఫలమైతే ఆర్ధికపరంగా దేశం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
దేశంలోని వృద్ధులు, ఇతర ప్రభావిత ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా లాక్ డౌన్ నుంచి బయట పడే మార్గం ఆలోచించాలని సూచించారు. వలస కూలీలకు, ప్రజలకు రాజకీయ సందేశాలు అక్కర్లేదని అన్నారు. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలని కోరారు. గ్రామాల్లో 200 రోజుల పాటు ఉపాధి హామీ పనులు దొరికేలా చూడాలని కేంద్రానికి సూచించారు. దేశ నిర్మాణంలో వలస కూలీల పాత్ర ఎంతో కీలకం అని..వారి రోడ్లపై నడుచుకుంటూ వెళుతూ తిండి లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ సంక్లిష్ట పేదలకు కేంద్రం అండగా నిలవాలని కోరారు.