Telugu Gateway
Andhra Pradesh

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆయన ప్రస్తుతం ఆగమ సలహాదారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హయాంలో ఆయన్ను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తప్పించారు. ఆ సమయంలో ఆయన ఆలయంలో పలు అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. వీటికి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. అవే ఆరోపణలను వైసీపీ కూడా చేసింది. ఇది అంతా గత చరిత్ర. ప్రస్తుతం టీటీడీ ఆగమసలహాదారుగా ఉన్న రమణదీక్షితులు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ‘ శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై జాతీయ స్థాయి ఆడిట్‌ జరగాలని రమణ దీక్షితులు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై ఈ ఆడిట్‌ జరపాలని’ కోరారు. స్వామీజీ ఇప్పుడు మనం ఈ అంశాన్ని అడగాలని ట్వీట్ లో పేర్కొన్నారు. రమణదీక్షితులు అడిగితే ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడగాలి కానీ..బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామిని అడగటంలో మతలబు ఏంటి?. టీటీడీ దేవస్థానం ఉంది ఏపీలో. ఆయన ఆ దేవస్థానంలో ఆగమసలహాదారు.జగన్ సీఎం అయిన తర్వాతే ఆయనకు ఈ పోస్టు దక్కింది.

టీటీడీ పేరుకు స్వయంప్రతిపత్తి గల సంస్థ అయినా నియంత్రణ అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. బోర్డు నియామకం నుంచి అన్ని అంశాలు ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. అలాంటిది సీఎం జగన్ ను కాకుండా బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామిని కోరటం ఆసక్తికరంగా మారింది. వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉండగా వెంకటేశ్వరస్వామి నగలు, ఆభరణాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై మాట కూడా మాట్లాడటం లేదు. టీటీడీలో సలహాదారుగా పనిచేసే రమణదీక్షితులు ఇలా సోషల్ మీడియా వేదికగా ఇలా డిమాండ్లు చేయవచ్చా?. టీటీడీలో జరిగిన లోగుట్లు అన్నీ తెలిసిన రమణదీక్షితులు ఆ వివరాలు అన్నీ సర్కారుకు చెప్పి విచారణకు కోరాలి కానీ.. సుబ్రమణ్యస్వామి పేరుతో చేయటం ఏమిటో అన్న చర్చ మొదలైంది.టీటీడీ భూముల అమ్మకం వ్యవహారం దుమారం రేపుతున్న తరుణంలో రమణదీక్షితుల ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it