Telugu Gateway
Telangana

రావాల్సింది 12 వేల కోట్లు..వచ్చింది 3100 కోట్లే

రావాల్సింది 12 వేల కోట్లు..వచ్చింది 3100 కోట్లే
X

జీతాలిస్తే ఖజానా ఖాళీ అవుతుంది

ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన సమావేశంలో అధికారులు తేల్చిన లెక్క ఇది. ఈ లెక్కకు అనుగుణంగా ముందుకెళ్ళాలని సీఎం కెసీఆర్ అధికారులకు సూచించారు. సో..మరోసారి వేతనాల కోత ఖాయం అయింది. సమావేశం అనంతరం ప్రభుత్వం చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాలి. రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది.

ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలి’’ అని అధికారులు వివరించారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ‘అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి. ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా అందించాలి. లాక్ డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి’ అని సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it