‘హ్యామ్’ బాట పట్టిన జగన్ సర్కారు

రివర్స్ తో ఆదా అంటూ హ్యామ్ తో ఖజానాకు చిల్లు
7200 కోట్ల రూపాయల పనులకు 14400 కోట్ల వ్యయం
చంద్రబాబు రాజధాని కోసం ఎంచుకున్న మార్గమే
జగన్ సర్కారు వాటర్ గ్రిడ్ కు
గత చంద్రబాబు సర్కారు మోడల్ నే ప్రస్తుత జగన్ సర్కారు కూడా ఫాలో అవుతోంది. ఓ వైపు ‘రివర్స్ టెండరింగ్’తో వందల కోట్ల రూపాయల ఆదా చేశామని చెప్పుకుంటూ ఇఫ్పుడు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ ఏఎం) తో ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం మోపేందుకు రెడీ అవుతోంది. ఏపీలో తలపెట్టిన వాటర్ గ్రిడ్ పనుల అప్పగింతకు సర్కారు ‘హైబ్రిడ్ యాన్యుటీ’ మార్గాన్ని ఎంచుకుంది. ఇది భారీ వ్యయంతో కూడుకున్న మోడల్. దీని వల్ల సర్కారుపై పడే భారం రెట్టింపు కానుంది. ఉదాహరణకు సర్కారు నిధులతో చేపడితే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు 7200 కోట్ల రూపాయలతో అయిపోతుందని అనుకుంటే..అదే హైబ్రిడ్ యాన్యుటీ ద్వారా చేపడితే ఆ వ్యయం కాస్తా చెల్లింపుల వ్యవహారం పూర్తయ్యే వరకూ 14400కోట్ల రూపాయలు అవుతుంది అన్న మాట. అంటే దాదాపు రెట్టింపు వ్యయం. సర్కారు ఖజానా ఖాళీ కావటంతో ఈ మోడల్ ను ఫాలో అవుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాజధానిలో వివిధ రకాల పనులకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ను ఎంచుకున్నారు. కానీ ఈ మోడల్ లో తలపెట్టిన ప్రాజెక్టులు ఏవీ పెద్దగా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు కూడా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ తోనే వాటర్ గ్రిడ్ తొలి దశను చేపట్టాలని నిర్ణయించి వేగంగా పావులు కదుపుతోంది. అయితే బ్యాంకులు ఏపీ సర్కారుకు రుణాలు మంజూరుకు అంతగా ఆసక్తిచూపటంలేదని ఓ ప్రముఖ కాంట్రాక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ రహదారుల ప్రాజెక్టులో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ను ఫాలో అవుతున్నారు. ఈ మోడల్ కింద ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం మాత్రమే సర్కారు కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లిస్తుంది.
మిగిలిన 60 శాతం నిధులను రుణంగా తెచ్చుకుని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. విడతల వారీగా సర్కారు ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ భారీ ప్రాజెక్టు చేపట్టినా ముందుండే ఓ నిర్మాణ సంస్థ ఇందులోనూ చక్రం తిప్పుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సర్కారు తొలి దశ కింద 12000 కోట్ల రూపాయల పైబడిన అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు రెడీ అయింది.