పోలవరానికీ ‘కరోనా దెబ్బ’!

ఏడాది జాప్యం తప్పదంటున్న ఇంజనీర్లు!
ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు కొత్త ఆటంకాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘రివర్స్ టెండరింగ్’ కోసం అంటూ పనులకు బ్రేక్ వేసింది. దీంతో కొంత సమయం వృధా అయింది. ఆ రివర్స్ టెండరింగ్ లోనూ ఒక్కటే సంస్థ..అదీ అస్మదీయ కంపెనీకే అవకాశం కట్టబెట్టారు. పాత కంపెనీలు చేసిన పనులు లెక్కకట్టి..మళ్లీ కొత్తగా పనులు దక్కించుకున్న సంస్థ సొంతంగా పనులు చేపట్టేందుకే చాలా సమయం పట్టింది. అంతా అయిపోయాక కరోనా దెబ్బపడింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. భారీ ప్రాజెక్టు కావటంతో ఇక్కడ పనిచేసే వారి సంఖ్య కూడా అంతే భారీ స్థాయిలో ఉంది. కరోనా కారణంగా పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి తొలుత 500 మంది కాలినడకనే తమ తమ స్వరాష్ట్రాలకు బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత కాలంలో మిగిలిన కార్మికులు కూడా పనిచేయటానికి ఏ మాత్రం ఆసక్తిచూపకుండా తమ తమ స్వస్థలాలకు వెళ్ళటానికి రెడీ అయిపోయి..అధికారులు, కాంట్రాక్టర్లలతో వాగ్వాదానికి దిగారు. అంతే కాదు..చాలా మంది వెళ్లిపోయారు.
జిల్లా అధికారులు కూడా వీరిని స్వస్థలాలను పంపటానికి తమ వంతు సహకారం అందించారు. వందలాది మంది కార్మికులు వెళ్ళిపోవటం ప్రాజెక్టు పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రాజెక్టులో పని జరిగే అత్యంత కీలకమైన సమయం కాస్తా పాత సంస్థలు చేసిన పనుల మదింపు, ఇతర కార్యకలాపాలకే సరిపోయింది. దీనికి తోడు తర్వాత కరోనా కారణంగా కార్మికుల సమస్య తలెత్తింది. మరో పక్షంలో రోజుల్లోనే వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాలు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు.
సహజంగా ఈ సీజన్ లో ఏ ప్రాజెక్టులోనూ పని ముందుకు సాగదు. పోలవరరం ప్రాజెక్టు వంటి చోట అయితే అసలు కుదరదు. ప్రాజెక్టు సైట్ లో కొంత మంది కార్మికులు పనిచేస్తున్నా అది సర్కారు చెబుతున్న షెడ్యూల్స్ ప్రకారం పనులు పూర్తి కావటానికి ఏ మాత్రం సరిపోదని అంటున్నారు.ప్రభుత్వం 2021 చివరకు ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ మారిన పరిస్థితుల్లో ఏడాది కాలం జాప్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఇది 2022కు పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు.